హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలంలో పిఎసిఎస్ నూతన గోడౌన్ ప్రారంభించి,అనంతరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 11 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు 3,43,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడు సిఎం కెసిఆర్ రైతులకు 24 గంటలు విద్యుత్ ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని,సీఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు పెట్టుబడికి ఇబ్బంది జరగకుండా రైతుబంధు లాంటి అద్భుత పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అంతే కాకుండా ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు రైతు ఏ కారణం చేతనైన మరణిస్తే ఎటువంటి పైరవీలు లేకుండా నేరుగా రైతు కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తున్న ఘనత కూడా సిఎం కెసిఆర్ కే దక్కుతుందని,ఆడబిడ్డ భారం కాకూడదని వారి పెళ్లికి ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదని ఒక దృఢ సంకల్పంతో సిఎం కెసిఆర్ మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి అద్భుత పథకాలను తెలంగాణ ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు.
ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని,నేడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును చూస్తున్నామని ఈ చిరునవ్వు సిఎం కెసిఆర్ తోటే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు,డిసిసిబి డైరెక్టర్లు,పి ఎ ఎస్ సి చైర్మన్లు,డైరెక్టర్లు,నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్