సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జి కల సాకార మైంది. ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ప్రజలు కన్న చిరకాల స్వప్నం ప్రారంభమైనపటికీ నేటికీ కోదాడ ఆర్టీసీ డిపో వారు హుజూర్ నగర్ నుంచి దాచేపల్లికి బస్సులు నడపక పోవటంతో ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ‘ విన్నపం ఒక పోరాటం ‘ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపే కృష్ణా నదిపై నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభమైనా, ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పట్లేదని అన్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రకు బస్సులు నడపటంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ విఫలమవుతున్నారని అన్నారు. ఆంధ్రా నుంచి మట్టపల్లి వరకు బస్సులు నడుస్తున్నాయని, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకు బస్సులు నడపక పోవటంతో కోదాడ ఆర్టీసీ డిపో వైఖరిని ఖండిస్తూ హుజూర్ నగర్ పాత బస్ స్టాండ్ దగ్గర ‘విన్నపం ఒక పోరాటం’ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తపరిచారు.
హుజూర్ నగర్ నుండి దాచేపల్లి కి నేరుగా ఆర్టీసీ బస్సులను నడిపినట్లయితే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తవని, ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుందని, వెంటనే అధికారులు స్పందించి హుజూర్ నగర్ నుండి దాచేపల్లి వరకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్, గోపి,వెంకన్న, రఫీ, గోవిందు,జయరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.