ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో కొన్ని చర్యలు నిరంకుశంగా ఉంటున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు కొన్ని సందర్భాలలో తీవ్ర భంగం కలుగుతున్నదని, పౌర హక్కుల సంఘం నాయకులను, జర్నలిస్టులను భావప్రకటనాస్వేచ్ఛ లేకుండా అణచి వేస్తున్నారని వారు అంటున్నారు.
ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ పై జరిగిన సదస్సులో పాల్గొన్న దక్షిణ, మధ్య ఆసియా ఇన్ చార్జి సహాయ కార్యదర్శి డీన్ థామ్సన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్న పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశం భారత్ అని ఆయన అన్నారు.
అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశం కూడా భారతేనని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయని ఆయన అన్నారు.
మానవహక్కులకు తరచూ భంగం కలుగుతున్నదని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కట్టడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉంటున్నాయని ఆయన అన్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చోట్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు తరచూ భంగం కలిగేదని, ఇప్పుడు భారత్ లో కూడా ఇలా జరగడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన అన్నారు.