నంద్యాల షరాఫ్ బజార్ సుంకులమ్మ వీధిలో ఉన్న దివ్యభారతి అనే నిండు గర్భిణీ కి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె తల్లి కర్నూలులో ఉంటుంది. ఆమె రాలేరు. మరొక వైపు పురిటి నొప్పులు ఏం చేయాలి.
తాను ఆరోగ్య పరీక్షల కోసం అప్పుడపుడూ వెళ్లే సుంకులమ్మ వీధి అర్బన్ అంగన్ వాడీ కేంద్రం ఆయా చెన్నమ్మ గుర్తొచ్చి సాయం చేయాలని అడిగింది. తక్షణమే స్పందించిన చెన్నమ్మ తనకు తెలిసిన ఒక ఆటోలో దివ్యభారతి ని ఎక్కించుకుని నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లింది.
డాక్టర్లతో పరీక్షలు చేయించి ఆమెతోనే ఆస్పత్రిలో నే ఉంది. శనివారం ఉదయం 11:30 గంటలకు దగ్గర ఉండి ప్రభుత్వ డాక్టర్ తో కాన్పు చేయించగా దివ్యభారతి పండంటి బాబు కు జన్మనిచ్చింది. చెన్నమ్మ కు ఆనంద భాష్పాలతో దివ్యభారతి కృతజ్ఞత తెలిపింది.
డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా చెన్నమ్మ చేసిన సేవను పొగిడారు. శనివారం రాత్రి 10:30 గంటలకు ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అంగన్ వాడీ ఆయా చెన్నమ్మ మంచి మనసును గుర్తించి రూ.20,000 ల నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని ప్రకటించారు.