అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2021ని దృష్టిలో ఉంచుకొని, మహిళల సంక్షేమానికి, వారి హక్కుల పట్ల చైతన్యం కల్గించేందుకు, ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింన కార్యక్రమాన్నివిజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ ప్రారంభించారు.
వచ్చే ఏడాదిలో మార్చి 7న జరగనున్నవంద రోజులపాటు ప్రధానంగా పది అంశాలపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దిశ కార్యక్రమంలో భాగంగా వివిధ చట్టంపై బాలికలకు, మహిళలకు అవగాహన కల్పిస్తారు. ‘సఖి’ కార్యక్రమం క్రింద మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమాన్నినిర్వహించి, వారి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు. అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తారు. భరోసా కార్యక్రమం క్రింద ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళా భద్రతపై తనిఖీలు, భద్రతా సౌకర్యాల పరిశీలిస్తారు. చేరువ కార్యక్రమం క్రింద మహిళా సంక్షేమ పథకాల అమలును పరిశీలించి, వివిధ శాఖల మహిళా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. మనకోసంలో భాగంగా మహిళా రక్షణా చర్యలు, హెల్ప్లైన్ నెంబర్లపై ప్రచారం చేస్తారు. ర్యాలీలు నిర్వహించి చైతన్యం కల్గిస్తారు. కేంపస్ కేప్స్ కార్యక్రమం క్రింద విద్యార్థినులతో రక్షణా బృందాలను ఏర్పాటు చేసి, పోలీసులను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. రైజింగ్ స్టార్స్ అంశంలో భాగంగా వివిధ రంగాల్లోని స్ఫూర్తిదాయక మహిళలను గుర్తించి, వారికి అభినందన, సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. సహాయ కార్యక్రమంలో భాగంగా స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖల సహకారంతో నిరాశ్రయ మహిళలకు ఆశ్రయాన్నికల్పిస్తారు. మార్పు అంశంలో భాగంగా మద్యంపై సమరం, ప్రభుత్వం చేపట్టిన దశలవారీ మద్యనిషేదం కార్యక్రమాలను నిర్వహిస్తారు. మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా వివిధ విద్యాసంస్థలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు.
ఈ వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యాచరణను రూపొందించింది. దీనికోసం గంట్యాడ, గజపతినగరం, బాడంగి, సాలూరు, భద్రగిరి, చీపురుపల్లి, భోగాపురం, ఎస్.కోట ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేషకుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, మెప్మా పీడీ కె.సుగుణాకరరావు, ఐసీడీఎస్ పీడీ ఎం.రాజేశ్వరి, ఏపిడీ బి.శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.