వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి వందో రోజుకి చేరుకుంది. 2020 నవంబర్ 26న శాంతియుతంగా ప్రారంభమైన రైతు నిరసన జనవరి 26 నాటి సామూహిక ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమంతో హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో సంఘ విఛ్చిన్నకరశక్తులు ప్రవేశించి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించారని రైతు నేతలు ఆరోపించారు. హింసకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పోలీసు శాఖ దర్యాప్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో, ఉద్యమం వంద రోజుల మైలురాయి చేరుకున్న సందర్బంలో దూకుడు పెంచేందుకు రైతు ఉద్యమ నేతలు సమాయత్తమవుతున్నారు. సాగుచట్టాలను నిరసిస్తూ మార్చి 6వ తేదీన రైతులు తమ ఇళ్లపై, పొలాలలో నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దిల్లీ కి పొరుగు రాష్ట్రాలతో అనుసంధానంగా ఉన్న కే ఎమ్ పీ ఎక్స్ ప్రెస్ మార్గాన్ని మార్చి 6 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పూర్తిగా మూసివేసేందుకు రైతు సంఘాలు నిర్ణయించాయి.
దీనికితోడు…నేటి నిరసన కార్యక్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొనేందుకు కార్యాచరణ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కోరడంతో పాటు మహిళావివక్ష , స్త్రీలపై లైంగికవేధింపులు వంటి కీలక అంశాలపై మహిళలు కేంద్రానికి వారి గళం వినిపించే అవకాశం ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
సుప్రీంకోర్టు జోక్యంతో…. కేంద్రప్రభుత్వం నెలకొల్పిన కమిటీలతో ఉద్యమనేతలు పలుసార్లు భేటీ అయినా కొలిక్కిరాలేదు.
పండించిన పంటలకు కనీస మద్దతు ధరతో సహా వాటిని విక్రయించే విషయంలో రైతు స్వేచ్ఛకు భంగం కలిగించే చట్టాలు సమూలంగా రద్దుచేయాలని ఉద్యమ నేతలు కరాఖండిగా తేల్చిచెప్పడంతో పీఠముడి మరింతగా బిగిసింది. కేంద్రం దిగి వచ్చే వరకు… అది మరో అయిదు వందల రోజులైనా ఉద్యమం కొనసాగిస్తామని రైతులు పట్టుదలగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో…జాతీయ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. రైతు పక్షపాత వైఖరితో ఒక వర్గం.. ప్రభుత్వ చర్యలు సమర్థిస్తూ మరో వర్గం వారి వారి వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి లబ్దిపొందుతున్న కొన్ని మాధ్యమాలు సాగు చట్టాలను ప్రశంసిస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించడం గమనార్హం.
జనవరి 26 న ట్రాక్టర్ల ర్యాలీ లో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనల చుట్టూ కొన్ని రోజులుగా చర్చలు జరగడం విశేషం. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమం ముసుగులో హింసాత్మక శక్తులు ప్రవేశించి, శాంతిభద్రతలకు భంగం కలిగించినట్లు ఒక వర్గం మీడియా అదేపనిగా వార్తలు, వ్యాఖ్యలు ప్రసారం చేసింది.
రైతు సత్యాగ్రహాన్ని రాజ్యవిద్రోహచర్యగా చూపించేందుకు సాహసించడం ఆందోళనకరం. రాజకీయపార్టీలకు అతీతంగా రైతు ఉద్యమానికి మద్దతు లభిస్తున్న కీలకసమయంలో, సమీపభవిష్యత్తులో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా రైతు సమస్యల్ని కూలంకషంగా అర్ధంచేసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన వైఖరితో మధ్యే మార్గం వైపు దృష్టి సారిస్తే ఉభయ శ్రేయస్కరం.
పొలమరశెట్టి కృష్ణారావు