అక్టోబరు 2వ తేదీ నాటికి విజయనగరం జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ గాంధీ జన్మదినోత్సవం నాటికి ఈ కలను సాకారం చేయాలని వారు కోరారు. జిల్లాలోని నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యుల్ని చేసేందుకు రూపొందించిన చిట్టిగురువులు ప్రత్యేక కార్యక్రమానికి, కలెక్టరేట్ ఆడిటోరియంలో శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులనే చిట్టిగురువులుగా ఎంపిక చేసి, వారి తల్లితండ్రులకు, బంధువులకు విద్య చెప్పించేందుకు రూపొందించిన ఈ కార్యక్రమం వినూత్నమని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా, పిల్లలు తమపై జిల్లా యంత్రాంగం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.
అందరి సమన్వయం, సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విశేషంగా కృషి చేసిన విద్యార్థులకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతీ ప్రభుత్వ శాఖా తమ బాధ్యతగా భావించి, ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విద్య విషయంలో దేశమంతా ప్రస్తుతం మన రాష్ట్రం వైపు చూసే విధంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఎన్నో సంస్కరణలను చేపట్టారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేవిధంగా మన విద్యార్థులను రూపొందించేందుకు సిఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించకుండా, దానివెనుకనున్న గొప్ప లక్ష్యాన్ని గుర్తించాలని ఉపాధ్యాయులను ఛైర్మన్ కోరారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, చిట్టిగురువులు కార్యక్రమం ద్వారా తల్లితండ్రులకు, బంధువులకు విద్యనేర్పే అవకాశం రావడం విద్యార్థులకు ఒక అదృష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల పెద్దలకు విద్యను నేర్పడంతోపాటు, పిల్లలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకొనే అవకాశం లభిస్తుందని అన్నారు.
ప్రతీవిద్యార్ధీ కనీసం ముగ్గురినైనా విద్యావంతులను చేయాలని కోరారు. పెద్దలకు పుస్తక జ్ఞానంతోపాటు, నిజజీవితానికి అవసరమైన విషయాలను కూడా బోధించాలని సూచించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, అలాంటి విషయాలపట్లా అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం జిల్లా అక్షరాస్యత సుమారుగా 84 శాతం ఉందని, దీనిని అక్టోబరు 02 నాటికి 99 శాతానికి చేర్చాలన్న గొప్ప లక్ష్యాన్ని ప్రతీఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.
గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్దికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తల్లుల పేరుమీదే అమలు జరుగుతున్నాయని, తల్లులను అక్షరాస్యుల్ని చేయడం ద్వారా, ఆ పథకాలు మరింత సద్వినియోగం అవుతాయని అన్నారు.
విద్య గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలి
స్వాతంత్య్రం రాకముందే చదువు గొప్పదనాన్ని మహాత్మా జ్యోతిభా ఫూలే గుర్తించి, పాఠశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. బాగా చదువుకోవడం ద్వారానే అంబేద్కర్ గొప్ప వ్యక్తిగా, అందరికీ ఆదర్శనీయులుగా ఎదిగారని అన్నారు. చదువు గొప్పదనాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలని, అందరూ చదువుకొనే విధంగా కృషి చేయాలని కోరారు.
ఎంఎల్సి డాక్టర్ పెనుమత్స సురేష్బాబు మాట్లాడుతూ, చిట్టిగురువుల ఒక సరికొత్త కార్యక్రమమని పేర్కొన్నారు. ఒకప్పుడు చదువుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని, ఎంతో వ్యయప్రయాశలతో చదువు కోవాల్సి వచ్చేదని అన్నారు. విద్య, వైద్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టివీ సీరియళ్లు, ఇతర కాలక్షేపాలను ప్రక్కనబెట్టి, తల్లితండ్రులు చదువుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యాయ ఎంఎల్సి పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ, చదువు ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదువురాని వారికి చేయూతనిచ్చి, వారిని కూడా అక్షరాస్యులను చేయాలని సూచించారు. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు లార్డ్ మెకాలే, బెంటన్ లాంటి బ్రిటీష్ జాతీయులు ఎన్నో సంస్కరణలను అమలు చేశారని చెప్పారు.
ప్రతీఒక్కరికీ విద్య అవసరమని, అప్పుడే సమాజ వికాశం సిద్దిస్తుందని అన్నారు. ప్రతిరోజూ కష్టపడితే గాని కడుపునిండని ఎంతోమంది దినసరి కూలీలు ఉన్నారని, అలాంటి వారు తమకు వీలైన సమయంలో చదువుకోవడానికి ఈ చిట్టిగురువులు కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.
వయోజన విద్య డైరెక్టర్ ప్రసాద్బాబు మాట్లాడుతూ, దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. వీటి ఫలితంగానే 55 శాతం ఉన్న అక్షరాస్యత క్రమేపీ 70 శాతానికి చేరుకుందని చెప్పారు. వయోజనులకు విద్య అన్నది నిరంతర కార్యక్రమంగా జరగాల్సి ఉందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా మొదటి స్థానానికి చేరుకొనేందుకు చిట్టిగురువులు కార్యక్రమం దోహదపడుతుందని, దీనికి తమవంతు సహాకారం అందిస్తామని చెప్పారు.
వయోజనవిద్య జిల్లా ఉపసంచాలకులు కోట్ల సుగుణాకరరావు మాట్లాడుతూ, అక్షరాస్యతను పెంచేందుకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. చిట్టిగురువులు ద్వారా సుమారు లక్షా, 02వేల 365 మందిని అక్షరాస్యులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న 7,8,9 తరగతుల విద్యార్థులచేత వారి తల్లితండ్రులకు, బంధువులకు చదువు చెప్పించి, వారిని అక్షరాస్యులను చేసేందుకు చిట్టిగురువులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చిట్టిగురువులు కార్యక్రమం కోసం జెడ్పి నిధులతో ప్రత్యేకంగా రూపొందించిన వాచకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పలువురు డైట్ విద్యార్థులు మాట్లాడుతూ, చిట్టిగురువులు కార్యక్రమం ప్రత్యేకతను వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎంఇఓలు, హెడ్మాష్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కౌట్స్ తదితరులు పాల్గొన్నారు.