ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గత రెండు పర్యాయాల్లో 60కి పైగా సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి భారీగా సీట్లు తగ్గుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైందని, ఆప్ అవినీతిపై బీజేపీ ప్రచారాన్ని కొందరు ప్రజలు విశ్వసించారనే విషయాన్ని ఆప్ నేతలు అంగీకరిస్తున్నారని అంటున్నారు. అధికారంలోకి రావడం ఈజీ కాదని, వచ్చినా కూడా 35 నుంచి 40 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆప్ నేతలు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు మొగ్గుచూపారని, కాంగ్రెస్, బీజేపీకి ఆ ఓట్లు చీలి ఉంటే తమకు కలిసొచ్చేదని, కానీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు బీజేపీ వైపు వెళ్లడం నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు ఆప్ నేతలు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఇమేజ్ బాగా తగ్గిందనే చర్చ జరుగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొవడంతో పాటు, ఆప్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, దీంతో గతంతో పోలిస్తే కేజ్రీవాల్ గ్రాఫ్ బాగా పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా అసలు ఫలితాలు ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.