నివర్ తుపాను భారీ బీభత్సాన్నే స్రష్టిస్తోంది. మధ్యరాత్రి పుదుచ్ఛేది వద్ద తీరం దాటి తుపాను పుదుచ్చేరి, తమిళనాడు, చెన్నైలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి ఎక్కడికక్కడ చెట్లు నేలకూలడం, కరెంటుస్థంభాలు నేలకూలడంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మరోవైపు అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ తుపాను వల్ల నష్టం జరగాల్సినంత జరిగిపోయింది. తుపాను నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం, పునరావాస కేంద్రాలు తదితర పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
మరోవైపు నివర్ ఎఫెక్ట్ తెగులు రాష్ర్టాల్లోనూ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఎగుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుపతిలో భారీ వర్షంతో కొండ చరియలు విరిగిపడగా అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. ఆలయంలోకి నీరు ప్రవేశించింది. దీంతో మోటార్ల సహాయంతో నీటిని తోడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ తుపాను భారీ నష్టాన్నే మిగులుస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఇలా అన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వేల ఎకరాల పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.
తుపాను ప్రభావం దక్షిణ తెలంగాణపై ఉంది. భారీ వర్ష సూచన చేశారు వాతావరణ అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందన్నారు. నల్గొండ ఖమ్మం, సూర్యాపేటలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయన్నారు. వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడ్తున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే.