హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో నవ వధువు దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భర్త ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మానస (24) కు జగద్గిరిగుట్ట కు చెందిన గంగాధర్ (32)కు గత సంవత్సరం నవంబర్ లో వివాహం జరిగింది.
వివాహమైన రెండు నెలలకి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. భర్త నుంచి విడిపోయిన మానస తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. పది రోజుల క్రితం గంగాధర్ తండ్రి చనిపోవడంతో భర్తను పరామర్శించేందుకు మానస ఇంటికి వచ్చింది.
మానస గర్భస్రావం చేయించుకున్నదని గంగాధర్ కు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తనకు తెలియకుండా ప్రెగ్నెన్సీని ఎందుకు తీసేసుకున్నావని భర్త ప్రశ్నించాడు. అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ పెరిగిపోయింది. దాంతో మానసను గొంతు నులిమి భర్త గంగాధర్ హత్యచేశాడు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.