బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దైంది. వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో కుండపోతగా వర్షం కురవకున్నా సరాసరి 4 సెంటిమీటర్ల వర్షపాతం రోజూ నమోదవుతోంది.
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని నాలాలన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు భారీగా రావడంతో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం వుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అయితే హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా ప్రస్తుతం 513.41 అడుగులకు చేరుకుంది. మరోవైపు జీహెచ్ఎంసి పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.