సెమీ కండక్టర్ (చిప్ ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు అనుకూల వాతావరణం (ఎకోసిస్టమ్) హైదరాబాద్ లో ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. సోమవారం నాడు తనతో భేటీ అయన పిటిడబ్ల్యు గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్, పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్ లో ఉంది. పరిశ్రమ ఏర్పాటు చేసే పక్షంలో ప్రభుత్వం విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి వివరించారు. ఇక్కడ నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదవ లేదని శ్రీధర్ బాబు తెలిపారు. సరైన ప్రతిపాదనలతో వస్తే తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. సెమీకండక్టర్ క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తమ ప్రతిపాదనలో ఉన్నట్టు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉత్పాదక కేంద్రం మొదటి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పిటిడబ్ల్యు ఏషియా విభాగం ఎండీ టార్ స్టెన్ సెయ్ ఫ్రైడ్ పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ స్థానిక భాగస్వామి బార్ ట్రానిక్స్ ఎండీ విద్యాసాగర్ రెడ్డి, సింగపూర్ కు చెందిన కన్సల్టెంట్ సంస్థ ‘టాప్2 పిటిఇ’ సిఇఓ రావు పనిదపు తదితరులు పాల్గొన్నారు
previous post