ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను వంగి వంగి దణ్ణాలు పెడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేయడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత వీడియోలు పెట్టి తనను కించపరిచేలా వ్యాఖ్యలు పోస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. అప్పుడు కూడా తాను ఎవరికి వంగి వంగి దణ్ణాలు పెట్టలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన సమయంలో ఎంపిల సమావేశం నిర్వహించినప్పుడు తాను కూడా వెళ్లానని, అప్పుడు ఆయనకు శాలువా కప్పానని రఘురామ తెలిపారు. తాను ఎక్కువ ఎత్తులో ఉంటాను కాబట్టి, జగన్ కు కొంచెం వంగి శాలువా కప్పాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వంగి వంగి దణ్ణాలు పెట్టడం అంటే తిరుపతి ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీకి వై ఎస్ జగన్ దణ్ణం పెట్టినట్లుగా పెడితే దాన్ని వంగి వంగి దణ్ణాలు పెట్టడం అంటారని ఆయన అన్నారు. తాను అలా వంగి వంగి దణ్ణాలు పెట్టలేని రఘురామకృష్ణంరాజు అన్నారు. తనను కించపరిచేందుకు ఈ వీడియో నిర్దేశించుకున్నారని, అయితే తాను అందుకు ఏ మాత్రం బాధపడటం లేదని, వీడియోను చూసి ఆనందించాలని ఆయన తన అభిమానులను కోరారు.