ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. నేడు ఆయన ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇళ్లు కూల్చివేత బాధితులకు ఒక్కొక్కరికి రూ. లక్ష వరకూ తన సొంత నిధుల నుంచి ఆర్థికసాయం అందించారు. నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటా. బాధితులకు భరోసా కల్పించేందుకే రూ. లక్ష ఇస్తున్నాం అని ఆయన తెలిపారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కక్షపూరితంగా చేశారని, ఇప్పటం కూల్చివేత వెనుక ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇప్పటంలో గడపలు కూల్చారు.. వైసీపీ గడప కూల్చేవరకు వదలిపెట్టం. అధికారంలోకి వచ్చినా.. రాకున్నా.. బాధితులకు అండగా ఉంటాం అని ఆయన అన్నారు. వైసీపీ నేతల దాడులకు జనసేన భయపడదు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం. మాట్లాడితే రౌడీసేన అంటున్నారు. మాది రౌడీసేన కాదు.. విప్లవసేన వైసీపీది రాజకీయ పార్టీ యా ఉగ్రవాద సంస్థా? అని పవన్ ప్రశ్నించారు. ప్రధానితో నేను ఏం మాట్లాడానో సజ్జలకు ఎందుకు? నా దగ్గరకు రండి మీ చెవిలో చెబుతా అని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయను.. నేనే కొడతా. నా యుద్ధం నేనే చేస్తా అని ఆయన స్పష్టం చేశారు.