ఐఏఎస్ అధికారుల పనితీరు ఎలా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. చెప్పడానికి వీలుకూడా కాదు. ఎందుకంటే వారు సర్వాధికారులు. వారి చేతులో విస్తృత అధికారాలు ఉంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు ఒక ఐఏఎస్ అధికారే సమాధానం చెప్పారు.
ఐఏఎస్ అంటే ఇండియన్ ఎడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ కాదని ఇప్పుడు అది ఐసీఎస్ గా మారిపోయిందని 1984 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కె బి ఎస్ సిద్దూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ది ప్రింట్ లో వ్యాస రూపంలో పోస్టు చేశారు. ఐసీఎస్ అంటే ఇండియన్ కష్టమర్ సర్వీస్ అని అర్ధం.
కష్టమర్ ఎవరైనా కావచ్చు రాజకీయ నాయకులు, మంత్రులు…. వారికి సేవ చేయడంలోనే ఐఏఎస్ అధికారులు తరించిపోతున్నారనేది ఆ వ్యాసం సారాంశం. ఐఏఎస్ ల గురించి ఈ విధమైన వ్యాఖ్యానాలు రావడం కొత్తేం కాదు కానీ ఈ వ్యాసాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి వి రమేష్ రీ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
డాక్టర్ పీ వీ రమేష్ నిన్నమొన్నటి వరకూ ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేషీలో అత్యంత కీలక స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తలలో నాలికలా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఉన్నారు.
నాలుగైదు రోజుల కిందట ఆయనకు కేటాయించిన శాఖలన్నింటిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పీకేశారు. డాక్టర్ పి వి రమేష్ ఆ రోజు నుంచి కార్యాలయానికి వెళ్లడం కూడా లేదు. శాఖలు పీకేస్తున్న విషయాన్ని కూడా ముందుగా ఆయనకు చెప్పలేదు. పి వి రమేష్ తో బాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ్ కల్లాం కూడా ఇదే అనుభవం జరిగింది. అలాంటి పి వి రమేష్ ఆ వ్యాసాన్ని రీట్వీట్ చేయడమే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది.