అధికార పార్టీ పెద్దలతో లోపాయకారిగా సెటిల్ మెంట్ చేసుకుంటే చాలు ఎలాంటి అక్రమ కట్టడాలనైనా కట్టుకోవచ్చు అనుకునేవారికి ఇది విషాద వార్త. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న అక్రమ కట్టడం కథ ఇది. ఈ అక్రమ కట్టడం విషయంపై సత్యం న్యూస్ లో కథనాలు వెలువడ్డ విషయం కూడా పాఠకులకు తెలుసు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఈ భవనానికి సంబంధించిన అంశాలపై వారం రోజుల కిందట సమీక్ష జరిపింది. ఎలాంటి సెట్ బ్యాగ్స్ లేకుండా భవనం నిర్మించినట్లు తేటతెల్లం కావడంతో ఈ భవనానికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయకూడదని నిర్ణయించి దీన్ని కూలగొట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ భవనానికి సంబంధించిన పెద్దలు అధికార పార్టీ నేతలతో లాలూచీ ఒప్పందం కుదుర్చుకోవడంతో స్థానిక మునిసిపల్ అధికారులు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఉన్నత స్థాయి కమిటీ జోక్యం చేసుకోవడంతో కథ ముగిసింది. ఆ భవనం కూలగొట్టడాన్ని నేడు మునిసిపల్ అధికారులు ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం 2019 మున్సిపల్ చట్టాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని అతిక్రమిస్తూ అక్రమంగా నిర్మాణం చేసిన ఆరంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ను అధికారులు గత ఏడాది మే నెలలో సీజ్ చేశారు. అప్పటిలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అప్పటి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బిల్డింగ్ ను సీజ్ చేశారు.
తెలంగాణ 2019 మున్సిపల్ చట్టం ప్రకారం బిల్డింగ్ సీజ్ చేయబడిందని అప్పటిలో ఆ అధికారి చెప్పారు. అంతే కాదు మళ్లీ ఈ బిల్డింగ్ నిర్మాణ కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. బిల్డింగ్ ముందు సీజ్ అయినట్లు బోర్డు పెట్టారు. అప్పటిలో అధికారుల విచారణలో తేలింది ఏమంటే చివరికి అక్కడ బోరు కూడా అక్రమంగానే వేశారు.
రాత్రికి రాత్రి అధికార నేత తో సెటిల్మెంట్?..పొద్దునే బోర్డు పీకేశారు
సీజ్ అయిన పది నెలల తర్వాత ఓ నేతతో కొద్ది రోజుల కిందట (మార్చి 6న ) ఆ బిల్డింగ్ యజమానులతో సమావేశమయ్యారని తెలిసింది. వారితో ఏమి లెక్క సెటిల్ చేసుకున్నారో తెలియదు కానీ పొద్దునే సీజ్ అయినట్లు ఉన్న బోర్డు పీకేశారు. నిర్మాణ పనులు మొదలు పెట్టారు.
హెచ్చరికలను తుడిపేశారు. ఎధేచ్ఛగా షట్టర్లు బిగిస్తున్నారు. పెయింట్ పనులు చేస్తున్నారు. అయితే మొదటి నుండి ఆ నాయకుడు కోటి పైగానే డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే దానికి అంగీకరించలేదని మొన్నటి దాకా ప్రచారం జరిగింది… ఇప్పుడు బహుశ బేరం కుదిరి ఉంటుందని కొల్లాపూర్ ప్రజలు అనుకున్నారు. దాంతో అధికారుల అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి పునర్ నిర్మాణం మొదలు పెట్టారు.
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.. అనుమతులు వచ్చే అవకాశమే లేదు
కొల్లాపూర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో సీజ్ అయిన అక్రమ బిల్డింగ్ నిర్మాణ పనులు గత నెలలో మొదలు కావడంతో కొందరు స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. భవన యజమానులు అనుమతులకోసం చేసే ఒత్తిళ్ళకు తట్టుకోలేక అధికారులు సెలవు పెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో తున్నారని మాటలు వినిపిస్తున్నాయి.
ఈ అక్రమ బిల్డింగ్ పై వార్తలు రాసినందుకు అక్రమ కేసులు…
గతంలో ఈ బిల్డింగ్ నిర్మాణం గురించి 2021 మార్చి నెలలో రిపోర్టర్ అవుట రాజశేఖర్ వెలుగులోకి తెచ్చారు. అధికారుల పరిశీలనలో కూడా ఉన్నది. 2021 మే నెలలో బిల్డింగ్ సీజ్ అయింది. అయితే ఆ బిల్డింగ్ పోలీస్ బెటాలియన్ సమక్షంలో సీజ్ అయింది. ఆ రోజు ఆ బిల్డింగ్ ను కూల్చాలని అందుకే బెటాలియన్ దింపారు. కానీ అలా జరగలేదు. సీజ్ మాత్రమే అయింది. అయితే అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని వెలుగులోకి తెచ్చిన రిపోర్టర్ పై స్థానిక ఎస్ఐ ప్రోద్బలంతో ఆ బిల్డింగ్ యజమానితో బ్లాక్ మెయిల్ చేసినట్టు కేసు పెట్టించారు.
మొత్తానికి ఇప్పుడు జిల్లా ఉన్నత స్థాయి కమిటీ ఆదేశాలతో ఇప్పుడు ఆ భవనం కూలగొట్టుడు మొదలు పెట్టారు.