ఇంటిలో పూజలు చేసిన వినాయక విగ్రహాలను వినాయక సాగర్ కు అలాగే పెద్ద విగ్రహాలను కొంకాయి చెన్నాయి గుంట చెరువుకు తరలించాలని తిరుపతి ప్రజలకు వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని 3 వ రోజు మూడు అడుగులు అంతకు మించి నిమజ్జనానికి తరలి వచ్చే భారీ విగ్రహాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కొంకాయి చెన్నాయి గుంట (స్ప్రింగ్ డేల్ స్కూల్ వద్ద) చెరువు వద్ద ఏర్పాట్లు చేశారు.
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు నేడు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీతో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.
తిరుపతి నగరంలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు, స్థానికులు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తరలించి 7 గంటల లోపు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసే విధంగా నగరపాలక సంస్థ అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు, వినాయక నిమజ్జన కమిటీ సభ్యులకు సహకరించాలని వారు కోరారు.