వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విశాఖపట్నానికి చెందిన కొయ్యా ప్రసాద్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అన్నీ తానై ఇప్పటి వరకూ వ్యవహరించిన నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డి.
అయితే ఇటీవలి కాలంలో విశాఖ కలెక్టరేట్ పేరును, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ఆయన పెద్ద ఎత్తున భూములు కొనడం అమ్మడం చేస్తున్నాడని పార్టీ దృష్టికి వచ్చింది. మితిమీరి చేస్తున్న ల్యాండ్ డీల్స్ కార్యకలాపాలను పార్టీ క్రమశిక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది.
కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును, పార్టీలోని పార్లమెంటు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి భూములు, ఇతరత్రా డీల్స్.. అంటూ ఎవరు అక్రమాలకు ఒడిగట్టినా ఇదేవిధమైన తీవ్రస్థాయి క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.