ఇంట్లో పని మనిషిపై దురుసుగా ప్రవర్తించిన ఒక మహిళకు సింగపూర్ కోర్టు 16 వారాల జైలు శిక్ష విధించింది. రివర్ వ్యాలీ రోడ్కు సమీపంలో ఉన్న కండోమినియం అపార్ట్మెంట్లో 2021 జనవరి 20 న ఈ సంఘటన జరిగింది. భారతీయ సంతతికి చెందిన మోనికా శర్మ 37 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన తన పనిమనిషిపై అఘాయిత్యం చేసింది. పని మనిషి బొమ్మలు శుభ్రం చేస్తుండగా మోనికా శర్మ ఆమెను చీవాట్లు పెట్టింది. అంతే కాకుండా పని మనిషి ముఖంపై మూడు సార్లు కొట్టింది. ఆ సమయంలో నిందితురాలి భర్త అక్కడే ఉండడంతో ఆయన గొడవ సద్దుమణిగేలా చేశాడు.
భార్య తరఫున బాధితురాలికి క్షమాపణలు చెప్పాడు. అయితే ఆ మహిళ సంతృప్తి చెందలేదు. ఎడమ కనుబొమ్మపై తీవ్రమైన గాయాలు, వాపు ఉన్నది. బాధితురాలు గాయాల చిత్రాలను తీసి భారతదేశంలోని తన ఏజెంట్కు పంపింది. ఆ తర్వాత ఏజెంట్ ఆ చిత్రాలను సింగపూర్లో తన సన్నిహితులకు పంపాడు. ఈ చిత్రాలతో సింగపూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (డిపిపి) ఆర్ అరవింద్రేన్ న్యాయస్థానంలో మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడిన మహిళను కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే మోనిక మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమె సెంటర్ ఆఫ్ సైకాలజీలో చికిత్స పొందుతున్నారని డిఫెన్స్ న్యాయవాది అమర్జీత్ సిద్ధూ కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు ఈ అభ్యర్ధనను పట్టించుకోలేదు. నేరానికి పాల్పడ్డందున ఆమెకు శిక్ష విధించింది.