రావల్పిండిలో శనివారం జరిగిన ర్యాలీలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ అన్ని అసెంబ్లీలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పంజాబ్, కేపీకే అసెంబ్లీలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాము ఈ వ్యవస్థలో భాగం కాలేమని ఆయన ఉద్వేగంతో చెప్పారు. అయితే చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడుతానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో తనను హత్య చేసేందుకు విఫలయత్నం చేసిన “ముగ్గురు నేరస్థులు” మళ్లీ తనను టార్గెట్ చేసేందుకు వెతుకుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
రావల్పిండిలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిర్వహించిన పెద్ద ర్యాలీని ఉద్దేశించి ఖాన్ మాట్లాడుతూ, తనకు మరణం చాలా దగ్గరగా ఉందని అన్నారు. తనపై దాడి సమయంలో తన తల పక్క నుండి బుల్లెట్లు వెళ్లాయని చెప్పాడు. కర్బలా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, “భయం మొత్తం దేశాన్ని బానిసలుగా చేస్తుంది. ప్రవక్త మొహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ మరియు అతని కుటుంబ సభ్యులు కర్బాలాలో చంపబడ్డారు, ఎందుకంటే వారు తమ కాలంలోని నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా గళం విప్పారు” అని ఖాన్ అన్నారు.
శనివారం హెలికాప్టర్లో ఆయన రావల్పిండికి చేరుకున్నారు. ఆయన వెంట వైద్యుల బృందం కూడా ఉంది. మాజీ ప్రధాని ఖాన్ లాహోర్ నుండి బయలుదేరినప్పుడు, గాయాల నుంచి ఇంకా కోలుకోలేదని అందువల్ల ప్రయాణం వద్దని వైద్యులు చెప్పినా ఖాన్ వినలేదు. మృత్యువును దగ్గరగా చూశానని అందుకోసం తాను ముందుకే వెళ్తానని ఖాన్ చెప్పాడు. “మీరు జీవించాలనుకుంటే, మరణ భయాన్ని విడిచిపెట్టండి” అని ఆయన అన్నారు.