గత నాలుగేళ్ళ బడ్జెట్ మాదిరిగానే ఈ ఏడాది 2023 కేంద్ర ప్రభుత్వ చివరి బడ్జెట్ లోనూ ఏపీకి మళ్ళీ మొండి చెయ్యే చూపారని, విభజన చట్టంలోని హామీల అమలు పూర్తిగా మరిచారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని ప్రధాన హామీలైన ప్రజా రాజధాని అమరావతికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిధులు, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ ప్రస్తావన లేదని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెరిగిన అంచనాల గూర్చి కానీ, ఏపీకి రావలసిన ప్రాజెక్టు పనుల బకాయిల చెల్లింపులు గూర్చి కానీ, రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గూర్చి కానీ ఎలాంటి మాట లేకపోవడం బాధాకరమన్నారు. లోటు బడ్జెట్ తో ఇప్పటికీ కోలుకోలేని విధంగా ఉన్న ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత వీడటం లేదన్నారు. లేస్తే ‘మేము మనుషులం కాదు’ అని మాట్లాడే బిజెపి ‘కొంగర మల్లయ్య’ లు బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడాలన్నారు.
అధికారంలో ఉన్న వైకాపా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై గళం ఎత్తాలని డిమాండ్ చేశారు. తెలుగింటి ఆడపడుచుగా చెప్పుకునే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ ‘అత్తగారి’ మీద కోపంతో ఏపి మాట పలకలేక పోయారో అని చమత్కరించారు. సాధారణ కేటాయింపులు, పన్ను మినహాయింపులతో బడ్జెట్ సమావేశాలను చప్పట్లతో ముగించారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం నుంచి ఏటా రూ.41 వేల 338 కోట్లు వాటా పనులను జమ చేసుకుంటున్న కేంద్రం ఏపీకి ఏమిచ్చిందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగాలని, చేతనైతే కడగాలని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.