బడా కార్పొరేట్ సంస్థ రాంకీ నిర్వాకంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండల పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులో రాంకీ సంస్థ మధ్యవర్తుల తో వేల ఎకరాల భూమిని 2010 లో రైతుల నుండి కొనుగోలు చేసింది.
అతి తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేసిన ఆ సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో భూమి విలువను 10, 15 రెట్లు అధికంగా చూపి రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో రైతాంగానికి అసలు సమస్య వచ్చి పడింది. మండలం లోని గుండ్రాంపల్లి, సుంకేనేపెల్లి, వెలిమినేడు గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులతో ఆందోళన చెందుతున్నారు.
గతంలో కూడా ఇలానే కొందరు ఇబ్బంది పడ్డారు
గతంలో లో కొంత మంది రైతులకు నోటీసులు రాగా కంపెనీ రైతులతో మాట్లాడి కొంత మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు చెల్లించగా, తిరిగి మళ్లీ కొంత మందికి ఆ శాఖ నుండి లక్షల రూపాయల్లో ఆదాయపన్ను చెల్లించాలని నోటీసులు రావడంతో కంగుతిన్నారు. గురువారం ఆ సంస్థ ప్రతినిధి ని కలిసి రైతులు ఈ విషయం గురించి తెలపగా ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
ఏది ఎలా ఉన్నా అమాయకులైన రైతులు ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులతో మానసికంగా తీవ్ర ఆందోళన పడుతూ కాలం గడుపుతున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలపై స్పందించి రామ్ కి బారిన పడిన తమకు న్యాయం చేయాలని రైతులు కోరుచున్నారు.
రాంకీ సంస్థ ఆదాయపు పన్ను చెల్లించాలి
ఆదాయపు పన్ను శాఖ నుండి తమకు నోటీసుల లో వచ్చిన మొత్తాన్ని రాంకీ సంస్థ ద్వారా కట్టించి తమను ఆదుకోవాలని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన రాంకీ బాధిత రైతు సిందం లక్మయ్య కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు సత్వర న్యాయం చేకూర్చాలని, తక్కువ ధరకు రామ్ కి సంస్థకు భూములు అమ్మిన పాపానికి తాము ఎంతో మనో వేదనకు గురి కావలసిన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.