పెరుగుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు విలవిలలాడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. రెండు నెలల క్రితమే గ్యాస్ ధర రూ.20.50 పెరిగింది. తాజాగా ఒకేసారి రూ.25 పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడినట్లయ్యింది. ఇప్పటికే డీజిల్, పెట్రోలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఖర్చులతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం ప్రభుత్వం అసమర్థత అని కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.
అసలే కరోనా కారణంగా ప్రతి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ తేరుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది అని కాట్రగడ్డ ప్రసూన కేంద్రం పై మండిపడ్డారు. ఏడాది కాలంగా ధరలు పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు, వంటగ్యాస్ ధరను ఇప్పుడు రూ.25 పెంచాయి. గతంలో రూ.600 నుంచి రూ.700 వరకు గల గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.వెయ్యికి చేరువైంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మాసం నుంచి గ్యాస్ ధర పెంచడంతో పాటు సబ్సిడీని కోత పెడుతూ వస్తున్నది.దీనిని బట్టి చూస్తుంటే గ్యాస్ ధరలు తో పాటు, నిత్యావసర ధరలు రోజు రోజు పెరగడం తప్ప ,సామాన్యులకు అందుబాటులో వచ్చే అవకాశం ఏ మాత్రం కనపడటం లేదన్నారు.
చిన్న కుటుంబాలు ఏడాదికి 6 నుంచి 7 సిలిండర్ల వరకు వినియోగిస్తున్నాయి. పెద్ద కుటుంబాలు ఏడాదికి 12కి పైగా సిలిండర్లు వినియోగిస్తారు. ముఖ్యంగా వినియోగదారుల్లో 70శాతం మేరకు సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారు. వీరి నెలసరి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఇలా ధర పెంచడంతో ఆయా వర్గాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. సిలిండర్ ధర పెరగడంతో యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు..దీనికి కేంద్ర ప్రభుత్వం తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వైఫల్యం అని దుయ్యబట్టారు.
ఏడాదిలో పదిసార్లు వంట గ్యాస్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి కుటుంబాలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతున్నది. అన్నిరకాల పన్నులు కేంద్రమే భరించి వినియోగదారులకు చమురు సంస్థలు ఇచ్చే ధరకే వంట గ్యాస్ అందించి ఆదుకోవాలని ఆమె కోరారు.