మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్, యోగా, మెడిటేషన్ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఉదయం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇందిరా గాంధీ స్టేడియం నుండి చత్రపతి శివాజీ బొమ్మ మీదుగా రాశివనం వరకు 2.0 రన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత మన జీవన విధానంలో బిజీగా ఉంటున్నామని, మన శరీరము, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగ, మెడిటేషన్, రన్నింగ్ చేయాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనాలని అన్నారు.
అనంతరం విద్యార్థినీ విద్యార్థులు యోగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు బహుకరించారు. 2.0 రన్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, నిజామాబాద్ NYK జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెలాల్, జిల్లా యువజన సంక్షేమ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, ఎన్ సి సి క్యాడెట్స్ పాల్గొన్నారు.