ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు డ్రోన్ లను అమెరికా కంపెనీ నుంచి భారత్ లీజుకు తీసుకుంది. జనరల్ ఆటోమిక్స్ అనే ఈ అమెరికన్ కంపెనీ ప్రిడేటర్స్ అనే పేరుతో డ్రోన్ లను రూపొందిస్తుంది.
చెన్నై తీరంలో ఉన్న ఐఎన్ఎస్ రాజాలీ పై ఒక డ్రోన్ ను ఉంచారు. అదే విధంగా మరో డ్రోన్ లద్దాక్ ప్రాంతంలో మొహరించారు. సముద్రంపైనా, భూ ఉపరితలంపైనా వినియోగించే ఇలాంటి మరో 30 డ్రోన్లను కూడా భారత్ తెప్పించుకుంటున్నది.
ఈ డ్రోన్లు మల్టీ మోడ్ నిఘా రాడార్లను కలిగివుంటుంది. అత్యంత అధునాతన టెక్నాలజీతో అనుసంధానం అయి ఉండే ఈ డ్రోన్ ఒకే సారి ఎక్కువ టార్గెట్లను ట్రాక్ చేయగలుగుతుంది. సముద్రంపై నిఘా వేసే డ్రోన్ లు జలాంతర్గాము లను ధ్వంసం చేసే యుద్ధ పరికరాలను కలిగి ఉంటాయి.
ఈ డ్రోన్ లు లైవ్ చిత్రాలను, చలనచిత్రాలను సేకరించి పంపుతాయి. అమెరికన్ కంపెనీ నుంచి కేవలం సాంకేతిక నిపుణులు మాత్రమే ఈ డ్రోన్ లతో బాటు మన దేశానికి వస్తారు. వారు కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే పర్యవేక్షిస్తారు.
డ్రోన్లు సేకరించే సమాచారం కేవలం భారత సైన్యం వినియోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. చైనా, పాకిస్తాన్ తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధునాతన డ్రోన్లు రావడం గమనార్హం.