దేశంలో 5G సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, 6G సాంకేతికతకు సన్నాహాలు మొదలైపోయాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన 6జీ టెక్నాలజీ దిశగా భారత్ కృషి చేస్తోందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో అంటే 2 సంవత్సరాలలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఈ సాంకేతికతపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2022 సంవత్సరం రెండో త్రైమాసికంలో 5G స్పెక్ట్రమ్ వేలం కూడా జరిగే అవకాశం ఉంది. 5G స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్(TRAI)కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి కాల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏడాది ప్రారంభంలో, టెల్కోల స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తొమ్మిది సంస్కరణలను ఆమోదించారు.