భారత్లో భారీ విధ్వంసానికి పాక్ కుట్రలు పన్నుతోంది. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్ కుట్రలను భారత ఆర్మీ భగ్నం చేస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాది ప్రాణాలతో దొరకగా, మరో ఉగ్రవాది హతమయ్యాడు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్ సెక్టార్ల గుండా భారీ చొరబాట్లకు ముష్కరులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. ఐతే నిఘా వర్గాల హెచ్చరికలతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. గతవారం రాంపూర్ సెక్టార్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా ఉరి సెక్టార్లో తమకు తారసపడ్డ టెర్రరిస్టులపైకి కాల్పులు జరిపింది. దేశంలో పండుగల వేళ భారీ విధ్వంసానికి కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ మద్దతున్న ఆఫ్గాన్ ఉగ్రవాదులను ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద నక్యాల్ సెక్టార్లో సిద్ధంగా ఉంచినట్టు గుర్తించారు. వీరందరినీ పూంచ్ నదిలో నుంచి భారత్లోకి ప్రవేశపెట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు.