దేశంలో మరెక్కడా లేని విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ యాప్ సిద్ధం అయింది. దీన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటన సందర్భంగా హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ నెల 22వ తేదీన సాయంత్రం ఏడున్నర గంటలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విందు ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఈ యాప్ ను ఆవిష్కరిస్తారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తొలి పర్యటన కావడంతో విందు ఏర్పాట్లపై మంగళవారం గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్ అధికారులతో సమీక్ష జరిపారు. భద్రత ఏర్పాట్లతో పాటు ఆతిథ్యానికి సంబంధించిన అన్ని విషయాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ , ప్రోటోకాల్ అదనపు కార్యదర్శి అరవిందర్ సిoగ్, జాయింట్ సెక్రటరీ జె భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.