కరోనా ఎఫెక్టు ఏమో గానీ ఈ సమాజం అత్యంత అమానవీయంగా మారుతున్నది. ఎక్కడో వినడం తప్ప ఈ అమానవీయ సంఘటన కరీంనగర్ లో కళ్లకు కట్టింది. కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ రెడ్ జోన్ లో ఉంది. ఇండోనేసియా నుంచి వచ్చిన మత ప్రచార బృందం కరీంనగర్ లోని ముకంపురా, కాశ్మీర్ గడ్డ, కలెక్టరేట్ ప్రాంతంలో తిరిగిన విషయం తెలిసిందే.
వారితో తిరిగిన ఒక స్థానికుడికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆ తర్వాత ఇండోనేసియా బృందంలోని ఏడుగురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆ తర్వాత అదే బృందంలోని మరో ముగ్గురికి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ ను రెడ్డ జోన్ గా ప్రకటించారు.
కరోనా పాజిటీవ్ కేసులను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. వారికి నిత్యావసర వస్తువులను మునిసిపల్ సిబ్బంది ప్రతి నిత్యం ఎంతో బాధ్యతగా వారికి ఇంటి వద్ద ఉంచి వస్తున్నారు. ఇండోనేసియా బృందం తిరిగిన ప్రాంతాలను కలిసిన మనుషులను గుర్తించే ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది.
అలాంటి రెడ్ జోన్ లో ఇప్పుడ పూర్తి లాక్ డౌన్ రావడం, ఉదయం కొద్ది సేపు మాత్రమే నిత్యావసరాలు తెచ్చుకునే వెసులు బాటు కల్పించడంతో స్థానికులు అదే సమయంలో నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారు. నేడు ఉదయం అదే విధంగా ఒక వ్యక్తి కూరగాయల కోసం వచ్చాడు. కళ్లు తిరిగి కింద పడిపోయాడు.
అయితే ఎవరూ అతనికి సాయం చేయలేదు. కరోనా భయంతో ఎవరూ అతని వద్దకు కూడా వెళ్లలేదు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఎంత హృదయవిదారకం? కరోనా భయంతో ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఈ సమాజాన్ని దేవుడు మాత్రమే కాపాడాలి.