వరి కొనుగోలు కేంద్రాల్లో అధిక బరువు తూకం వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే, డిసిసి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర రెడ్డి పిలుపు మేరకు మామడ, దిలావర్ పూర్, లక్ష్మణ్చందా, సారంగాపూర్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యంలో తప్ప తాలు వల్ల బస్తా 41 కిలోలు తూకం వేయాలని ఆదేశించినా నిర్మల్ నియోజకవర్గం లో మాత్రం 42, 43 కిలోలు తూకం వేస్తున్నారన్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
లారీలు దొరకడం లేదన్న నెపంతో బస్తాకు 10 రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు అవుతున్నా ఇప్పటివరకు కొనుగోలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సరైన రీతిలో కొనుగోళ్లు చేపట్టాలని లేనట్లయితే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.