సమాజంలోని సమకాలీన సమస్యలకు పరిష్కారం చూపేలా సృజనాత్మకతో వినూత్న ఆవిష్కరణల అవసరం ఎంతైనా ఉందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకొని ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తున్న వినూత్న ఆవిష్కరణల పోటీలకు జిల్లా నుండి ఎంపికైన ప్రదర్శన ఆవిష్కర్తకు జిల్లా కలెక్టర్ శుక్రవారం సర్టిఫికెట్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో జిల్లా నుండి పలు పాఠశాలల విద్యార్థులు,ఉద్యోగులు, ఉత్సాహ వంతులైన యువ టెక్నోక్రాట్స్ వినూత్నంగా తయారు చేసిన ప్రదర్శనలు పాల్గొన్నాయని కలెక్టర్ అన్నారు.
వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన వొల్లాల సాయి కుమార్ ఆవిష్కరించిన కోవిడ్-19 కు గురైన వ్యక్తిని గుర్తించడంతోపాటు ఆటోమేటిక్ గా సానిటైజ్ చేసే పరికరం ఈ సారి ఆన్ లైన్ లో నిర్వహించిన ప్రదర్శనకు ఎంపికైనట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎంఏ. గౌస్, జిల్లా ఆడిట్ అధికారి ఐ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.