ఇంటర్మీడియట్ పరీక్షలు మరోసారి వాయిదా పడనున్నాయి. గతంలో ఇంటర్ షెడ్యూల్ ను జేఈఈ పరీక్షల ప్రకటన తరువాత మార్చారు. ఐతే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహిస్తామని ఇప్పటికే ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు రెండు పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధమవడం కష్టంగా మారుతుంది.
దీంతో మరోసారి ఇంటర్ పరీక్షలు వాయిదా పడే అవకాశం వున్నది. కాగా ఇంటర్ పరీక్షల మార్పు నేపథ్యంలో పదో తరగతి షెడ్యూల్ సైతం మారేలా ఉంది. ఇదిలా ఉండగా విద్యార్థుల విన్నపం మేరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల షెడ్యూల్ను సవరించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. వీటిని ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహిస్తారు. రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు ఉంటాయి. హాల్టికెట్లను ఏప్రిల్ రెండో వారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నేపధ్యంలో ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశం వున్నది. అయితే జేఈఈ పరీక్షల కంటే ముందే ఇంటర్, పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే ఎలావుంటుదనే దానిపై ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.