ఇంటర్ పరీక్షలను ఏపి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల ఐదు నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు గగ్గోలు పెట్టారు. ప్రతి రోజూ వేలాది కేసులు నమోదు అవుతున్నందున పరీక్షలు వాయిదా వేయాలని ఎందరు కోరినా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల టైమ్ టేబుల్ ప్రకటించేసింది.
పిల్లలు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడిన వారు ఈ పరిణామంతో ఎంతో ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు మరింత వత్తిడికి గురయ్యారు.
పరీక్షలు వాయిదా వేయాలని అన్ని వర్గాల ప్రజలు అడిగినా జగన్ ప్రభుత్వం ఏ మాత్రం తన మంకుపట్టు వీడలేదు. పరీక్షలు నిర్వహించాల్సిందేనని పట్టుపట్టి కూర్చుంది. దాంతో కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
పరీక్షల నిర్వహణ విషయంపై రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. రేపు మళ్లీ కేసు విచారణ ఉన్నందున నేటి సాయంత్రం పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నాం. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం అని మంత్రి వెల్లడించారు.