క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు బిఆర్ఎస్ అధ్వర్యంలో నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళనాలు ఖమ్మం నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే తోలి సమావేశం ఆదివారం ఖమ్మం లో మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమ్మేళనంలో బిఆర్ఎస్ జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, ఎంపి నామా నాగేశ్వరరావు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. దళిత బందు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని, వారి పట్ల జాగ్రతగా వుండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తనకు ఇక్కడే ఓటు ఉందని, ఇక్కడే చదివినానని, ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, తన బతుకు ఇక్కడే, తన చావు కూడా ఇక్కడే అని ఆవేశంగా అన్నారు. ఖమ్మం ప్రజలు తన కుటుంబ సభ్యులు అని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చగలిగామని వివరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.