కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ ను ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నదని INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. INTUC జాతీయ అధ్యక్షుడు డాక్టర్ G సంజీవరెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ నగరంలో రిజర్వు బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్ డి చంద్రశేఖర్, విజయ్ కుమార్ యాదవ్ కూడా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య కాలంలో జాతీయోద్యమంలో చివరి ఘట్టంగా బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా ఆగష్టు 9 1942 న గాంధీజీ క్విట్ ఇండియా నినాదాన్ని ఇచ్చారని, దాని స్ఫూర్తితో INTUC ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు.
దేశంలో ఉన్న సహజ వనరులు, ప్రభుత్వ రంగసంస్థలు, రైల్వేలు, బ్యాంకింగ్ రంగాలను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రవేటీకరిస్తున్నారని అన్నారు. కార్మికుల ఆమోదం లేకుండా కార్మిక చట్టాలను సవరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కార్మిక సంఘాలన్ని కలసి నిరసన కార్యక్రమం చేపట్టాయని తెలిపారు.