అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీ చేసిన ద్విచక్రవాహనం పైనే దుండగులు బీదర్లో దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు. అదే వాహనంపై తిరిగి హైదరాబాద్కు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎంజీబీఎస్ పార్కింగ్ ఏరియాలో దుండగులు వాడిన బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్లో దోపిడీ చేసిన దుండగులు బస్టాండ్లో వాహనాన్ని పార్క్ చేసి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా రాయపూర్ వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కాల్పులు జరిపారు. వారు పారిపోయి బీహార్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కర్ణాటకలోని బీదర్లో ఇటీవల పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం సొమ్మును చేజిక్కించుకుని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. దొంగలు అఫ్జల్గంజ్లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్జల్గంజ్లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు.. ట్రావెల్స్ మేనేజర్పైనా కాల్పులు జరిపారు.