రాబోయే వేసవి కాలంలో ప్రకాశంలో జిల్లాలో తాగునీటి సమస్యపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాసిన లేఖకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. నీరు లేకుండా అడుగంటిన చెరువుల వివరాలతో పాటు జిల్లాలో పరిస్థితుల పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమగ్ర వివరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని మంత్రి ఎమ్మెల్యేల లేఖకు జవాబిచ్చారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణాజలాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చెరువులను నింపాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు లేఖ రాశారు.
దీనికి స్పందించిన మంత్రి ఎమ్మెల్యే గొట్టిపాటి కి ఫోన్ చేసిన మాట్లాడారు. ఈ సమస్యను జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన దృష్టికి తీసుకు వచ్చారని, పరిశీలనలో ఉందన్నారు. రానున్నవేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని మంత్రి ఎమ్మెల్యే గొట్టిపాటి కి ఫోన్ లో వివరించారు.