ములుగు జిల్లా లో ఒక్క ఎకరం కూడా ఖాలీగా ఉండవద్దని, చివరి ఆయకట్టు వరకు నీరు అందించే ప్రణాళికలు చేస్తూ, చాలా సమర్దవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది.
7వ విడత హరితహారం, నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యాచరణ పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశం లో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ప్రతి రైతుకు పంటకు 5 వేల రూపాయల చొప్పన రెండు పంటలకు 10వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నామని చెప్పారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించుకుని రైతులు అమ్ముకున్నారని ఆమె తెలిపారు.
త్రాగు నీరు, సాగు నీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ప్రజలు దాహార్తిని తీర్చగలిగామని ఆమె అన్నారు. ప్రజల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ బ్యారేజి నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత మాట్లాడుతూ కేంద్రం ద్వారా రామప్పను టూరిస్ట్ హబ్ గా యునెస్కో గుర్తింపు పొందే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వైద్య శాఖ ద్వారా చేపడుతున్న అనేక సదుపాయాలు మారుమూల ప్రాంతాలకు చేరే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్నారు. పోడు భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా అన్నారు.
ఈ సందర్భంగా MLC బాలసాని లక్ష్మి నారాయణ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాల నిర్మాణం పైన జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఉపయోగ పడేలా చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాల అమలులో ప్రజాప్రతినిధులను భాగం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పల్లె ప్రగతి నాలుగవ విడతలో భాగంగా జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, MPTC లు, సర్పంచ్ లు ముందస్తు ప్రణాళికతో పని చేయాలని కోరారు.
అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపయోగం లేని బోర్ బావులు ఉంటే వాటిని పూడ్చాలని అన్నారు. రోడ్లకు ఇరువైపులా ఎవేన్యు ప్లాంటేషన్ ఏర్పాటు చేసే క్రమం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హరిత హరం వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య, జిల్లా పరిషత్ సిఎఒ ప్రసూనా రాణి ,డిపిఓ వెంకటయ్య , వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.