సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఉగాది ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అమ్మవారి దేవస్థానంలో శనివారం జరిగిన ఉత్సవ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తేదీ జరగనున్న ఉగాది ఉత్సవం ఆనవాయితీగా జరుగుతోందన్నారు.
కార్పోరేషన్, పోలీస్, తదితర శాఖల సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని కోరారు. కార్పొరేటర్లు, వైసీపీ నేతలు స్వచ్ఛందంగా ఈ ఉత్సవంలో పాల్గొని భక్తులకు సేవలు అందించాలని వారికి ఆహ్వానాన్ని పలికారు. ఇరుకళల అమ్మవారు నెల్లూరు నగరంలో ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారని, ఆమె పట్ల భక్తులకు అపార నమ్మకం ఉందని పేర్కొన్నారు.
దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల వరప్రసాద్ ఈ సమీక్ష లో ముఖ్య పాత్ర వహించారు. డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు, వైసీపీ నేతలు, అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఉత్సవ కరపత్రాన్ని ఎంపీ ఆదాల ఆవిష్కరించారు.