టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్యే కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు ఈ గవర్నర్ కు ఆమె ఆడబిడ్డ అని గుర్తుకు రాలేదా అని ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, ఎం. ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే నోముల భగత్ ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు దోచుకున్న వై ఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అంటూ వస్తున్న షర్మిల మాట్లాడే భాష ఆడబిడ్డలు మాట్లాడే భాషేనా అని వారు ప్రశ్నించారు. రెచ్చగొట్టే అసత్యాలు చెబుతున్న షర్మిలను వెనకేసుకురావడం గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కు తగదని వారు హితవు పలికారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన షర్మిళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. షర్మిల కుటుంబం తెలంగాణ వ్యతిరేక కుటుంబం…తెలంగాణ కు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్ కు పోవాలంటే వీసా తీసుకుని పోవాలని అన్నారు. గతంలో షర్మిళ హైదరాబాద్ లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్ లో బ్రతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారు.
ఆమె సోదరుడు వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని షర్మిల సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతున్నారు. వైఎస్ సన్నిహితుడు కె.వి.పి.రామచందర్ రావు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన తెలిపారు. వైఎస్ కుటుంబం పై తెలంగాణ ప్రజల్లో కోపం వుంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారు అని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. షర్మిల మాట్లాడే భాష సంస్కార హీనంగా వుందని, షర్మిల మాట్లాడే భాష ఆడబిడ్డ మాట్లాడే విధంగా ఉన్నాయా…? అని వారు ప్రశ్నించారు. చెన్నూరులో షర్మిల తనపై తీవ్ర అసత్య ఆరోపణలు చేశారని, తాను తన కార్యకర్తలను సముదాయించాను అని బాల్క సుమన్ తెలిపారు.
షర్మిల తన భాష మార్చుకోకపోతే ఏమైనా అయితే ఇక నుంచి తమకు సంబందం లేదని ఆయన అన్నారు. అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు…కృష్ణా,గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు అని వారన్నారు. షర్మిలకు తెలంగాణ గురించి ఏం తెలుసు అని వారు ప్రశ్నించారు. కిరాయి మనుషుల తోలుబొమ్మల ఆటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని టీఆర్ఎస్ నాయకులు అన్నారు.