తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిని వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతమున్న కోవిడ్ 19 సంక్షోభం అన్ని పరిశ్రమ వర్గాల పైన కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ కు ఉన్న ఇతర అనుకూలతల వలన ఐటి పరిశ్రమ తిరిగి అభివృద్ధి బాట పడుతుందన్న విశ్వాసం మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీయా) నూతన కార్యవర్గం మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్ లో కలిసింది. జాతీయ సగటు ను మించి భారీగా ఐటి ఎగుమతులను సాధించిన తెలంగాణ, ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, కేటీఆర్ నాయకత్వానికి అభినందనలు తెలియజేసింది.
ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తాం
గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన మద్దతు సహకారంతో హైదరాబాదులో ఐటి పరిశ్రమ పెద్ద ఎత్తున వృద్ధి చెందిందని ఈ సందర్భంగా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకుని వైరస్ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఐటి పరిశ్రమ వర్గాల నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ప్రస్తుత సంక్షోభం సమసిపోయిన తర్వాత కంపెనీలు గతంలో ప్రకటించిన భవిష్యత్ ప్రణాళికల పైన ముందుకు పోతాయన్న నమ్మకం తమకు ఉందని వారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటి ఉద్యోగులకు ఎదురవుతున్న పరిమితులు, ప్రభుత్వం మరియు ఇతర అధికార వర్గాల నుంచి కావాల్సిన సహాయ సహకారాలు పైన పలు సూచనలను మంత్రి కేటీఆర్ కి అందజేశారు.
కేంద్రం స్కీమ్ లు కూడా సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం సైతం దేశీయంగా ఉన్న పరిశ్రమలను మరియు ఇన్నోవేషన్ కు మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఐటీ పరిశ్రమ ప్రతినిధులకు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ లోని అనేక కంపెనీలు నూతన పరిష్కారాలతో ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోందని, ఇలాంటి వాటిని తెలంగాణ ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తామని ఆయా కంపెనీలకు అండగా నిలుస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మద్యనే విహజ్ స్టార్ట్ అప్ అందుబాటులోకి తీసుకువచ్చిన అన్ లైన్ మీటింగ్ సోల్యూషన్ ను ఐటి శాఖలో అంతర్గత సమావేశాలకు వాడుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమ వృద్ధి రేటును కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోనున్నట్లు ఇందుకు హైసీయా సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.