కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో సోమవారం రద్దయిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన మళ్లీ ఖరారైంది.
గురువారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్షా తో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు.
విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి మళ్లీ మరునాడు అదే ప్రత్యేక విమానంలో ఆయన తిరిగి విజయవాడ చేరుకుంటారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో తనకు జరిగిన లాకప్ హింసపై లేఖలు రాయడం, జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతున్నది.
జాతీయ స్థాయిలో రఘురామకృష్ణంరాజు ఇప్పటికే తనకు జరిగిన అన్యాయాన్ని అందరికి చెప్పారు. ఈ నేపథ్యంలో హస్తినలో పార్టీకి, తనకు జరిగిన డ్యామేజీని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత వరకూ పూడ్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
అమిత్ షాతో సమావేశం తర్వాత ఢిల్లీలో జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్షెకావత్ సహా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలవనున్నారు.
పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.