మాట తప్పడం మడం తిప్పడం మా వంశంలో లేదని అన్నారు ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో ఎన్నో సార్లు మాట తప్పారు… మడం తిప్పారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన జగన్ తనకు విశ్వసనీయత ఉందని తరచూ చెబుతుంటారు.
చంద్రబాబునాయుడికి విశ్వసనీయత లేదు అని కూడా ఆయన తరచూ చెబుతుంటారు. మిగిలిన విషయాలను పక్కన పెట్టి తాజాగా మాట తప్పిన, మడం తిప్పిన విషయాన్ని ప్రస్తావించుకుందాం. 2020 జనవరి 27న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు చేయాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే…. ‘‘శాసన మండలికి ఎలాంటి ప్రజాప్రయోజనాల్లేవు. దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ. కేబినెట్ కేవలం శాసనసభకే జవాబుదారీగా ఉంటుంది కానీ శాసనమండలికి కాదు. ఏడాదికి రూ.60 కోట్లు ఈ దండగ పనికి ఖర్చు చేయడం ఆమోదయోగ్యం కాదు. బిల్లులకు అడ్డు తగులుతూ దిక్కుమాలిన ఆలోచనలు చేసే మండలి అవసరం లేదు. దానిని రద్దు చేస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. త్వరలో మా పార్టీకి మండలిలో మెజారిటీ వస్తుందని అందరికీ తెలుసు. అయినా సరే… ప్రజావసరాలు, ప్రభుత్వ బాధ్యతలే మాకు ముఖ్యం. అందుకే మండలిని రద్దు చేస్తున్నాం అని ఆయన చెప్పారు.
మరి ఇంతటి వృధా ఖర్చును మళ్లీ తలకెందుకు ఎత్తుకుంటున్నారు? ఈ వృధా ఖర్చును ప్రజల పైన ఎందుకు రుద్దుతున్నారు? దిక్కుమాలిన ఆలోచనలు చేసే శాసన మండలి ఇప్పుడు అవసరం అంటూ మళ్లీ తీర్మానం ఎందుకు చేశారు? జగన్ పాలనలో ఏ మాత్రం లాజిక్ లు ఉండవని నిర్ధారించేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఏ మాత్రం ముందు చూపు లేకుండా కేవలం కులం ప్రాతిపదికన మాత్రమే ఆలోచిస్తే ఇలానే ఉంటుందనడానికి ఇది తాజా ఉదాహరణ. శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ లేని సమయంలో రద్దు కోసం ప్రతిపాదించారు. మెజారిటీ మార్కు దాటగానే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కొందరు విలేకరులు ఇదే విషయాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు మెజారిటీ వచ్చింది కాదా ఇప్పటికీ పాత వైఖరికే కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించగా ఎట్టిపరిస్థితుల్లో మండలి రద్దుకే కట్టుబడి ఉంటాం అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇలా మాట తప్పుతూ మడం తిప్పుతూ జగన్ తన విశ్వసనీయత కోల్పోతున్నారు.