ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మత విశ్వాసాలను పక్కన పెట్టి మరీ స్వామీజీలను సందర్శిస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ ఆయన తరచూ స్వామీజీలను కలవడం విచిత్రంగానే అనిపిస్తున్నది. ఎక్కువగా జగన్ మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠానికి వెళుతుంటారు.
శారదా పీఠం స్వామీజీని రాజ గురువు అని కూడా చాలా మంది అంటుంటారు. విశాఖ శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర స్వామి దగ్గరకు వెళ్లిన ఎంతో మంది ఐఏఎస్ లు, ఐపిఎస్ లు మంచి పోస్టింగులు పొందారని కూడా అంటుంటారు.
జగన్ దృష్టిలో పడాలంటే స్వామీ అండదండలు ఉండాలని భావించిన ఎంతో మంది రాజకీయ నాయకులు స్వరూపానందేద్ర సరస్వతి వద్ద క్యూలు కట్టేశారు కూడా. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా స్వరూపానందేంద్ర మాట్లాడలేదు.
ఇదే విషయాన్ని చాలా మంది ప్రశ్నించారు. అయినా స్వామీజీ చలించలేదే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల కిందట జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వరూపాందేంద్ర సరస్వతి కామెంట్ చేశారు. తిరుమల తిరుపతి జంబో జెట్ కార్యవర్గాన్ని ఆయన ప్రశ్నించారు.
ఆ తర్వాత నుంచి స్వరూపానందేద్ర పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తున్నది. అనూహ్యంగా ఈ సారి విజయవాడలో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. మామూలుగా ఏదైనా కార్యక్రమం ఉండి.. ఆశ్రమ నిర్వాహకులు పిలిస్తే వెళ్లి అందులో పాల్గొని రావడం సహజం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో అలా విశాఖ శారదా పీఠం ఆశ్రమానికి వెళ్లారు. అయితే విజయవాడ పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శంచలేదు. ఈ నెల 18వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళుతున్నారు.
విజయవాడ పటమట శ్రీ దత్తనగర్ లోని అవధూత దత్తా పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి సందర్శించి మరకత రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోనున్నారు. దాదాపుగా గంటన్నర సేపు ఆయన పర్యటన ఉంటుంది.
ఈ పర్యటన ఉద్దేశం ఏమిటో వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఆశ్రమంలో ఏదైనా ఉత్సవాలు జరిగితే వెళ్లి తీర్థప్రసాదాలు స్వీకరించి రావడం సహజమే. కానీ ప్రత్యేకంగా ఏ కార్యక్రమం లేదు..
దసరా ఉత్సవాలు కూడా ముగిసిపోయిన తర్వాత ఆయన ఆశ్రమాన్ని ఎందుకు సందర్శిస్తున్నారన్నది ఇతర రాజకీయ పార్టీలకు కూడా పజిల్గా మారింది. అందుకే అందరూ ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం అంటూ ఊహాగానాలు ప్రారంభించేశారు.