వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలపై నిఘా పెడుతోందని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, అది నేడు నిజమైందని టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేతలపైనే కాదు, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా నిఘా పెట్టారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.
జగన్ బండారాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారు అని ఆయన విమర్శించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ పై నేను మాట్లాడినందుకు నా సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు ? అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాభివృద్దిపై దృష్టి సారించకుండా ఫోన్ ట్యాపింగ్ లతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఇంటిలిజెన్స్ విభాగం వాడే సాప్ట్ వేర్ తో పాటు అదనంగా ప్రవేట్ వ్యక్తుల ద్వారా మాల్ వేర్ తీసుకుని నిఘా పెట్టారు. అందుకు ప్రవేట్ వ్యక్తులకు డబ్బులు కూడా ముట్టజెప్పారు. గతంలో హైకోర్టు జడ్జిలపై వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టినదానిపై దేశమంతా చర్చ జరిగింది.
దీనికి సంబందించి బిల్ హైకోర్టులో ఫైల్ అయ్యింది. ఎవరిపై, ఏ సమయంలో నిఘా పెట్టాలి, ఎవరి అనుమతితో నిఘా పెట్టాలన్న నిభంధల్ని జగన్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కేశవ్ అన్నారు. ఎవరెవరిపై నిఘా పెడుతున్నారో, ఏఏ నంబర్లలపై నిఘా పెడుతున్నారో ఆ కాఫీలు హోం సెక్రటరి, లా సెక్రటరికీ ఇస్తున్నారా? ఇవేమీ పాటించకుండా రాత్రికి రాత్రి ఆ కాఫీలు తగలెయ్యడానికి మీ దగ్గరే ఉంచుకుంటున్నారు.
గతంలో పెగాసెస్ కొన్నారని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపించారు, కానీ నిరూపించలేకపోయారు. డేటా చౌర్యం చేశామన్నారు, ఆ కేసు తేలిపోయింది. వైసీపీ ప్రభుత్వమే ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు చివరకు సొంత పార్టీ నేతలపై కూడా నిభంధనలకు విరుద్దంగా నిఘా పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలు నియోజవకర్గాల ఇన్ చార్జుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎవరేం మట్లాడుతున్నారో వింటున్నారు. కాదని చెప్పే దైర్యం వైసీపీకి ఉందా?
ఎవరిపై నిఘా పెట్టారో, ఏ ఏ నంబర్లపై నిఘా పెట్టారో కేంద్ర సంస్ధల చేత ఆడిట్ చేయించడానికి సిద్దమా? నిఘా కోసం ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై కూడా కాగ్ ఆడిట్ చేయించటానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమా ? అని ఆయన ప్రశ్నించారు.