ఎస్ సి ఎస్ టి చట్టం దుర్వినియోగం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఎస్ సి ఎస్ టి అత్యాచార నిరోధక చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నదని జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది జగన్ అండ్ కో వ్యవహారశైలి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ పేరుతో ఎవరో ఫేస్బుక్లో జగన్మోహన్రెడ్డి కాళ్లకు తిరుపతి పార్లమెంటు అభ్యర్ధి గురుమూర్తి ఫిజియోథెరఫీ చేస్తున్నట్లు ఫొటో పెడితే దాన్ని వక్రీకరిస్తున్నారని వర్ల రామయ్య తెలిపారు.
పాదానికి ఫిజియోథెరపీ చేసే గురుమూర్తికి ఓట్లు వేస్తారా? ఆంధ్రుల హక్కుల కోసం గళమెత్తి పార్లమెంటులో పోరాడే ధీరమహిళ పనబాక లక్ష్మి గారికి ఓట్లు వేస్తారా? అని చిన్న పోస్టింగ్ పెడితే చంద్రబాబుపై కేసు పెట్టారని వర్ల రామయ్య తెలిపారు.
దానిని చిలవలు పలవలుగా చేసి ఘనాపాటీలైన వైయస్సార్సీపీ దళిత వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు నందిగాం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కైలే అరుణకుమార్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఫిజియోథెరపిస్ట్ గా జగన్మోహన్రెడ్డికి ఎంతోకాలం నుండి సేవలందిస్తున్న వ్యక్తి గురుమూర్తిగారు కాదా? ఫిజియోథెరపిస్ట్ గా ఆయన పాదాలు మసాజ్ చేయడం సర్వసాధారణం కాదా? ముఖ్యమంత్రే తనకు ఫిజియోథెరపిస్ట్ గా పనిచేసిన గురుమూర్తిని, తనకు అత్యంత నమ్మకంగా ఉన్నందున తిరుపతి పార్లమెంటు సీటు ఇస్తున్నానని ప్రకటన చేస్తే ఈ ముగ్గురు దళిత మేధావులు ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు? అని వర్ల రామయ్య అన్నారు.
‘‘ మీ వైయస్సార్సీపీ డిజిటల్ వింగ్ మార్చి 16వ తేదీన పెట్టిన పోస్టులో జగన్మోహన్రెడ్డి పాదానికి గురుమూర్తి వైద్యం చేస్తున్నాడు. ఈరోజు టీడీపీ పోస్టు అని చెప్పబడుతున్న దానిలో జగన్కు, మంత్రి పెద్దిరెడ్డికి చేస్తున్న వైద్యం ఫోటో మార్చి 16న జగన్మోహన్రెడ్డి కి చేస్తున్న వైద్యం ఫోటో వైరుధ్యమేముంది? మరి జగన్మోహన్రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎందుకు రిపోర్టు చేయలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఫిజియోథెరపి వైద్యాన్ని సూచిస్తూ బొమ్మ పెడితే దాన్ని ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి పూర్తిగా అలవాటు పడిన మీ పార్టీ, మీరు చంద్రబాబుపైన, ఆయన కుమారుడి మీద చర్యలు తీసుకోమని కోరతారా? అయితే జగన్మోహన్రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి ధైర్యముంటే..? అని వర్ల రామయ్య అన్నారు.