రాష్ట్ర హైకోర్టు తీర్పు వై ఎస్ జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి అన్నారు. ఇంగ్లీష్ మీడియం ను నిర్బంధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 81, 85 లను నేడు హైకోర్టు రద్దు చేయడం హర్షణీయమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగు భాష అమ్మ లాంటిదని, ఇంగ్లీషు భాష ఆయా లాంటిదని ఆయన అన్నారు. కడప జిల్లా వేంపల్లె లోని స్వగృహంలో బుధవారం నాడు తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. జీఓ 81,85 లను రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చారిత్రక తప్పిదాన్ని హైకోర్టు సరిదిద్దిందన్నారు.
జీఓ 81,85 లను జగన్ ప్రభుత్వం జారీ చేయడం విడ్డూరం, మూర్ఖత్వం అని అన్నారు. ప్రపంచంలో ప్రతి దేశం, మన దేశంలో ప్రతి రాష్ట్రం తమ తమ బాల బాలికలకు పాఠశాల విద్యను మాతృభాషనే బోధిస్తున్నారని వివరించారు. ఐక్య రాజ్య సమితి, యునెస్కొ కూడా పాఠశాల విద్యను మాతృభాషలోనే బోధించాలన్నారని సూచించారు.
హైకోర్టు తీర్పుతోనైనా వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి మాతృభాష అయిన తెలుగు భాషను మృత భాషగా చేయవద్దని విజ్ఞప్తి చేశారు.