విశాఖపట్నం రాజధాని అని ప్రకటించేసిన ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు కేసుపై ఇప్పుడు తొందరపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తమ పిటిషన్ పై సత్వరమే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాసింది.
ఆదివారం సాయంత్రం 5.00గంటల వరకు మెన్సన్ జాబితాలో ఈ కేసు ప్రస్తావన కనిపించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం ఏంటనే అంశంపై న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది. ఇవాల్టి మెన్షన్ జాబితాలో దీన్ని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను అభ్యర్థించింది. ఆదివారం సాయంత్రం వరకూ సుప్రీం కోర్టులో సోమవారం మెన్షన్ జాబితాలో చేర్చాల్సిన అంశాలలో ఈ కేసు లేదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ తర్వాత ఏమైనా మెన్షన్ జాబితాలోకి వస్తుందేమోనని ప్రభుత్వ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. సోమవారం ఒకవేళ మెన్షన్ చేసినా కూడా విచారణకు తేదీ ఇచ్చే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో చెప్పడం ద్వారా ప్రభుత్వ అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.
దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ఒప్పందం కింద 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో సీఆర్డీయే రద్దు పరచడానికి వీలులేని ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్లీ ఆ అంశంపై ప్రభుత్వం వెనక్కి ఎలా వెళుతుందని హైకోర్టు ప్రశ్నించింది.