జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఎత్తిపోతల పథకంగా మార్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.
చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన అభివృద్ధిని కూడా తానే చేసినట్టు జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో జరిగిన గోదావరి నీటి మళ్లింపు కార్యక్రమాన్ని కొత్తగా చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు.
బాబు హయాంలో 86 శాతం పనులు జరుగగా, జగన్ రెండేళ్ల పాలనలో కేవలం 0.89 శాతం పనులు మాత్రమే జరిగాయని, అప్రోచ్ ఛానల్ పనుల్లో మాత్రం 14 శాతం పూర్తిచేశారని తెలిపారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఒక ఎకరం భూమి సేకరించ లేదని, ఒక్క వ్యక్తికి కూడా పునరావాసం కల్పించలేదని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని నిలదీసిన నిర్వాసితులు త్వరలో ముఖ్యమంత్రి చొక్కా పట్టుకుని అడిగేందుకు సిద్ధపడుతున్నారని హెచ్చరించారు.
రివర్స్ టెన్ డర్ ద్వారా 750 కోట్లు అదాచేసినట్టు చెప్పుకునే వారు పనుల విలువను 5535 కోట్ల నుంచి 7192 కోట్లకు అంటే అదనంగా 1657 కోట్లు పెంచారని విమర్శించారు.
అలాగే కాంట్రాక్టర్లకు పనులు చేపట్టక ముందే 500 కోట్ల మోబలైజేషన్ నిధులు అంటూ కట్టబెట్టారని చెప్పారు. గతంలో విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి రాజీనామా చేయాలని చెప్పిన జగన్ ఆ మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.