వినయ విధేయ రామా!ప్రత్యేక హోదా అడగలేదేందుకు జగన్ మామా?అంటూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి వినయ విధేయ రాముడులా నడుచుకున్నారని,నీతి ఆయోగ్ సమావేశంలో కనీసం ప్రత్యేక హోదా గురించి, పోలవరం ప్రాజెక్టును గురించి ఇతర విభజన హామీలను గురించి మాట్లాడే సాహసం చేయలేక పోయారని, మోడీ చేతిలో ఉన్న సెంగోల్ అనే రాజదండంతో మొట్టికాయలు వేస్తారని భయపడినట్లున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవసరాల కోసం పోరాడలేనప్పుడు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం అడగలేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. కేంద్రం పై పోరాడుతున్న ఇతర ప్రతిపక్ష పార్టీలలో ఉన్న తెగువ మన జగన్మోహన్ రెడ్డికి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నది అని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పోరాడలేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని నవతరంపార్టీ నుండి డిమాండ్ చేశారు.